టిడ్కో ఇళ్ల విషయంలో వైకాపా ప్రభుత్వ మోసాన్ని వివరిస్తూ రంజాన్ వేళ ముస్లిం మహిళ కన్నీరు పెట్టుకున్నారు. మీరైనా మా బాధలు తీర్చాలని తెదేపా అధినేత చంద్రబాబు ఎదుట విలపించారు. గురువారం నిడదవోలు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు బస చేయగా.. అక్కడికి కొందరు ముస్లిం మహిళలు వచ్చారు. చంద్రబాబుకు కష్టాలు చెప్పుకొన్నారు. అందులో షబానా అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘మీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డిపాజిట్లు చెల్లించాం. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఇంతవరకూ ఇల్లు ఇవ్వలేదు. మధ్యలో బ్యాంకు రుణాల కోసం సంతకాలు చేయాలని అడిగారు. మేం ఒప్పుకోలేదు. ఇంటి తాళాలు చేతికొచ్చే వరకూ రుణాలు చెల్లించనక్కర్లేదని చెప్పి సంతకాలు తీసుకున్నారు. ఇప్పుడు రుణ వాయిదాలు చెల్లించాలని బ్యాంకు నుంచి మెసేజ్లు వస్తున్నాయి’ అని ఆవేదన చెందారు. అప్పులకు వడ్డీలు, ఇళ్లకు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామన్నారు. ఆమె వేదన విన్న చంద్రబాబు.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, టిడ్కో ఇళ్లు అందించే బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
source : eenadu.net
Discussion about this post