ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సభ్యులు అల్లరి చేసిన తీరు వారు ఎంత అధమస్థాయికి పతనమైంది తెలియచేస్తోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే తన భార్యను ఏదో అన్నారని లేని సాకును చూపి సభకు రావడం మానుకున్నారు. పోనీ తనతో పాటే మిగిలినవారిని కూడా బహిష్కరింపచేశారా అంటే ఆ పని చేయలేదు. వారిని అసెంబ్లీలోకి పంపి అల్లరి చేయించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చేది కొద్ది మందే అయినా, గొడవ చేయడానికి మాత్రం సిగ్గుపడలేదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సభలో నిరసనలు చెబుతుంటారు. అది తెలిసిన విషయమే. దానికి కొన్ని హద్దులు ఉంటాయి. కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభలో అరాచకంగా ప్రవర్తించడం ద్వారా వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాల్లో ప్రముఖంగా వార్తలు వస్తాయన్న భావనతో రెచ్చిపోయి వ్యవహరించారు.
శాసనసభ ఎన్నికల ముందు చివరి సెషన్గా జరిగిన సమావేశాలలో ప్రచారం కోసం వారు చేసిన హడావుడి తెలిసిపోయింది. ఏదో ఒక కారణం చెబుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం పొడియంలోకి దూసుకురావడం, ఆ తర్వాత కాగితాలు చించడం, వాటిని స్పీకర్పైకి విసరడం, ఆయన ముఖానికి ప్లకార్డులు అడ్డుపెట్టి, నినాదాలు చేయడం వంటి అల్లరి చేష్టలతో ప్రజల దృష్టిని ఆకర్షించాలని యత్నించారు.
చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ యథా ప్రకారం తన పిచ్చి పనులతో సభలో ఏ మాత్రం హుందాగా లేకుండా వ్యవహరించారు. గతసారి మాదిరే ఈ సెషన్లో కూడా ఆయన విజిల్స్ తీసుకువచ్చి ఈలలు వేయడం చూసి అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. సినిమాకు, అసెంబ్లీకి తేడా లేకుండా వ్యవహరించారు. ఆయన అంటే మానసికంగా అంత స్థిరత్వం లేని మనిషి కనుక అలా చేశారులే అనుకుంటే కాస్త పద్దతిగా ఉంటారనుకునే సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వంటివారు కూడా అదే బాటలో నడిచారు.
source : sakshi.com
Discussion about this post