వైకాపా ప్రభుత్వం నాలుగున్నరేళ్లు నిద్రపోయి.. ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రతి అడుగూ గందరగోళమే. అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ల రోస్టర్ వరకు అడుగడుగునా అయోమయం. పరీక్షలకు సరిపడా సమయం లేక ఓ పక్క, అప్లికేషన్లలో ఇబ్బందులు, రిజర్వేషన్ల రోస్టర్లో గందరగోళం మరో పక్క అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడా కోటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 2న జారీ చేసిన జీఓ-77లో కొత్త రిజర్వేషన్ రోస్టర్ను ప్రకటించింది. వీరికి హారిజంటల్ రిజర్వేషన్ పాటించాలని, సమాంతర రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని సూచించింది. కానీ, డీఎస్సీలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు సమాంతర రోస్టర్ పాయింట్లు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోకుండా పాయింట్లు ఇచ్చారు.
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం కొన్ని జిల్లాలో హారిజంటల్, మరికొన్ని జిల్లాల్లో రోస్టర్ పాయింట్లు (వర్టికల్) రిజర్వేషన్ అమలు చేశారు. ఎస్జీటీ, ఎస్ఏలకు కొన్ని జిల్లాలు ఒక విధానం.. మరికొన్ని జిల్లాలు మరో విధానాన్ని పాటించాయి. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాళ్లకు పాత రిజర్వేషన్ రోస్టర్ పాటించారు. ఒక్క డీఎస్సీలోనే రెండు విరుద్ధ రిజర్వేషన్ల విధానం పాటించారు. ప్రభుత్వం పాటిస్తున్న ఈ రోస్టర్ విధానం వల్ల కొందరు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయకుండానే దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. జిల్లా, జోన్ల వారీగా రిజర్వేషన్ పోస్టులు ప్రకటించాల్సి ఉండగా.. రోస్టర్ పాయింట్ల వారీగా ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఒక జిల్లాలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకే అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యను విని స్పందించే పరిస్థితి కనిపించడం లేదు.
ఆ చిక్కులకు పరిష్కారమేది?
డీఎస్సీకి మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటా చూపించలేదు. కొందరికి పరీక్ష కేంద్రం కనిపించలేదు. స్థానిక జిల్లా మాత్రమే అడగడంతో దాన్ని నమోదు చేశారు. ఈ లోపాలను సవరించుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్ ఐచ్ఛికం ఇవ్వలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో 30 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. ఇప్పుడు వీరందరూ మళ్లీ దరఖాస్తు చేయాలా? లేదంటే ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా అనేదానిపై స్పష్టత లేదు. 22వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనున్నందున అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
సిలబస్లో కొత్త చిక్కులు
ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 3-5 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న సిలబస్, 6-10 తరగతులకు పాత సిలబస్, ద్విభాషా పాఠ్యపుస్తకాలను అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. డీఎస్సీకి వచ్చేసరికి కేవలం టాపిక్స్ మాత్రమే ఇచ్చింది. టెట్కు 20 రోజులు సమయం ఇవ్వగా.. ఆ తర్వాత డీఎస్సీకి ఐదు రోజులే మిగిలి ఉంది. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయి. డీఎస్సీ పరీక్షలు మార్చి 15న ప్రారంభమై 30తో ముగుస్తాయి. టెట్కు సన్నద్ధమైన విద్యార్థులు ఆ పరీక్ష రాసిన తర్వాత ఐదు రోజుల్లోనే డీఎస్సీ ఎలా రాయగలుతారు? టెట్ కోసం చదివిన సిలబస్కు డీఎస్సీకి సిలబస్కు కొంత వ్యత్యాసం ఉంది. నాలుగున్నరేళ్లు డీఎస్సీ ఇవ్వకుండా జాప్యం చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించి, చదువుకునేందుకు సమయం లేకుండా చేసిందని అభ్యర్థులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. దరఖాస్తుల సమర్పణకు గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. తరచూ సర్వర్ మొరాయించి, వెబ్సైట్ పని చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు రుసుము ఆన్లైన్లో చెల్లిస్తున్నా ఐడీ రాకపోవడంతో కొంతమంది రెండు, మూడు పర్యాయాలు చెల్లించాల్సి వస్తోంది. డెబిట్ కార్డు నుంచి కట్ అయిన మొత్తం వెంటనే తిరిగి బ్యాంకు ఖాతాకు రావడం లేదు.
సర్వర్ లోపాలతో అభ్యర్థులకు ఇక్కట్లు
డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. సర్వర్ లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో రూ.250- రూ.500 ఉండే రుసుమును ఇప్పుడు రూ.750కి పెంచారు. పైగా ఆన్లైన్లో నగదు చెల్లించి, ఓటీపీని వెబ్సైట్లో నమోదు చేసినా కొందరికి ఐడీ నంబరు రావడం లేదు. భీమవరానికి చెందిన ఓ అభ్యర్థి.. ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ (పీజీటీ, టీజీటీ), ఎస్జీటీ, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ విభాగాల్లో దరఖాస్తుకు రూ.3,750 రుసుము చెల్లించారు. ఈ మొత్తం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాతాకు జమైంది. కానీ రిజిస్ట్రేషన్ సంఖ్య రాకపోవడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తికాలేదు. దీనిపై వెబ్సైట్లో ఇచ్చిన నంబర్లను సంప్రదించగా.. అవి పనిచేయడం లేదు. దాంతో మళ్లీ నగదు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
source : eenadu.net
Discussion about this post