వైకాపా అయిదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్.. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలకు గమ్యస్థానంగా, కార్యక్షేత్రంగా తయారైంది. విదేశాల నుంచి కంటెయినర్లలో టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాలు నేరుగా రాష్ట్రంలోకి దిగుమతి అయిపోతున్నాయి. ఇతర పదార్థాల్లో ఈ మాదకద్రవ్యాల్ని కలిపి ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాటిని ప్రాసెస్ చేసి మాదకద్రవ్యాల్ని వెలికితీసి మార్కెట్లోకి పంపిస్తున్నారు. రూ.లక్షల కోట్ల విలువైన ఈ వ్యవస్థీకృత అక్రమ దందా జగన్ జమానాలో ఉద్ధృతంగా సాగిపోతోంది. ఏపీలోకి సరకు తరలిస్తే నిఘా, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు తమను పట్టించుకోవన్న ధీమాతో స్మగ్లర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా బ్రెజిల్ నుంచి నేరుగా విశాఖపట్నానికి ‘డ్రైడ్ఈస్ట్’ మాటున వేల కిలోల మత్తుపదార్థాలను దిగుమతి చేసుకున్నా, రెండున్నరేళ్ల కిందట విజయవాడ చిరునామాతో అఫ్గానిస్థాన్ నుంచి వేల కోట్ల విలువైన హెరాయిన్ను తరలించినా వాటన్నింటికీ ఆ ధీమాయే ప్రధాన కారణం. డీఆర్ఐ, సీబీఐ అధికారులకు ఏదో విశ్వసనీయ సమాచారం వచ్చినప్పుడు తనిఖీలు చేస్తేనే రూ.వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడుతుంటే.. వాటి దృష్టికి రాకుండా ఇంకెంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి దిగుమతి అవుతున్నాయో!
సంధ్యా ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకు వచ్చిన కంటెయినర్లో మొత్తం 20 ప్యాలెట్లలో ఒక్కోటి 25 కిలోల పరిమాణం కలిగిన 1000 బస్తాల ‘ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్’ ఉంది. ఒక్కో ప్యాలెట్ నుంచి ఒక్కోటి చొప్పున ర్యాండమ్గా మొత్తం 20 బస్తాలను సీబీఐ అధికారులు బయటకు తీసి పరీక్షించగా వాటన్నింటిలోనూ కొకైన్, మెథక్వలోన్, మార్ఫిన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కలిన్ వంటి మాదకద్రవ్యాలు ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన 25 వేల కిలోల ‘డ్రైడ్ ఈస్ట్’లోనూ మాదకద్రవ్యాలు ఉన్నట్లే. సగటున కిలో డ్రైడ్ ఈస్ట్లో 200 గ్రాముల మాదకద్రవ్యాలు కలిసి ఉంటాయనుకున్నా.. దాదాపు 5వేల కిలోల మత్తు పదార్థాలు ఏపీలోకి వచ్చినట్లు అనధికారిక అంచనా. బహుశా దేశ చరిత్రలోనే ఇంత భారీ మొత్తం మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇదే తొలిసారి. ప్రస్తుతం భారతదేశ మార్కెట్లో హెరాయిన్ కిలో రూ.8 కోట్లు, కొకైన్ కిలో రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. అంటే కనీస స్థాయిలో చూసినా బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి వచ్చిన కంటెయినర్లలోని మాదకద్రవ్యాల విలువ రూ.వేల కోట్లలో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లెక్కల ప్రకారమైతే మరింత ఎక్కువే ఉంటుంది.
అఫ్గానిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా సెమీ ప్రాసెస్డ్ టాల్కమ్ స్టోన్స్ ముసుగులో విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో వస్తున్న 2,988.21 కిలోల హెరాయిన్ను గుజరాత్లోని ముంద్రా పోర్టులో 2021 సెప్టెంబర్లో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దాని విలువ రూ.25 వేల కోట్లకు పైనే ఉంటుందని తేల్చారు. విజయవాడ సత్యనారాయణపురం గడియారం వారి వీధి ఇంటి నంబర్ 23-14-16 చిరునామాతో మాచవరం సుధాకర్ ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేశారు. ఇది ఆయన భార్య దుర్గా పూర్ణిమా వైశాలి పుట్టినిల్లు. ముంద్రా పోర్టులో ఈ కంటెయినర్ పట్టుబడటంతో ఈ డ్రగ్స్ దందా బయటపడింది. లేదంటే ఆ వేల కోట్ల హెరాయిన్ ఏదో రూపంలో విజయవాడకు చేరేదే.
బ్రెజిల్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల నుంచి ఏపీలోకి మాదకద్రవ్యాలను అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాల ప్రమేయం లేకుండా తరలించటం అసాధ్యం. అయితే వారు మాదకద్రవ్యాల దిగుమతికి ఆంధ్రప్రదేశ్నే ఎందుకు కార్యక్షేత్రంగా మలుచుకున్నారు? ఇక్కడ వారికి ఎవరి అండదండలున్నాయి? ఏపీని వారి స్మగ్లింగ్ కార్యకలాపాలకు సురక్షిత స్థావరంగా భావిస్తున్నారా? ఈ వ్యవస్థీకృత దందా వెనక రాష్ట్రంలో ఎవరి ప్రమేయం ఉంది? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే నిఘా, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎందుకు వీటిని గుర్తించట్లేదు? ఎందుకు పట్టుకోవట్లేదు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అఫ్గానిస్థాన్ నుంచి విజయవాడకు వస్తూ ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ కేసులో… ఉగ్రవాద కోణం ఉన్నట్లు ఎన్ఐఏ ఇప్పటికే తేల్చింది. ఇప్పుడు బ్రెజిల్ నుంచి వచ్చిన మాదకద్రవ్యాలు వైకాపా నాయకుడికి చెందిన కంపెనీ పేరిట ఏపీలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వాటి వెనక అధికార పార్టీ పెద్దలు, నాయకుల ప్రమేయంపై సీబీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
source : eenadu.net
Discussion about this post