అనకాపల్లి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలకు 14,15 వ ఆర్థిక సంఘాల ద్వారా పంపిన రూ,,8629 కోట్లను వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలి – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు – Y.V.B. రాజేంద్రప్రసాద్.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి!
సర్పంచులకు, ఎంపీటీసీలకు,కౌన్సిలర్స్ కు, కార్పొరేటర్స్ కు – రాజేంద్రప్రసాద్ పిలుపు
అనకాపల్లి కలెక్టరేట్ ముందు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో సర్పంచుల ధర్నా వై.వి.బి.రాజేంద్రప్రసాద్, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల అధ్యక్షతన జరిగినది._
రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలలోని మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన 2018 – 19 సం,,నికి రూ,,1729.23 కోట్లు, 2019- 20 సం,,నికి రూ,,2336.56 కోట్లు, మరియు 15వ ఆర్థిక సంఘం నిధులు 2020 -21 సం,,నికి రూ,, 2625 కోట్లు, 2021 -22 సం,,నికి రూ,, 1939 కోట్లు మొత్తం కలిపి రూ,,8629.79 కోట్లు రూపాయలను గ్రామపంచాయతీలు ఇవ్వకుండా, చెక్ లపై సర్పంచుల సంతకాలు లేకుండా , సర్పంచులకు చెప్పకుండా గ్రామపంచాయతీల సి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో నుంచి మా నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి తన సొంత అవసరాలకు,పథకాలకు దారి మళ్లించి వాడి వేసుకున్నదని, ఇది అన్యాయం, అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకం. ఇది రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు వెన్నుపోటు పొడిచినట్లే. కనుక ఆ రూ,,8629.79 కోట్లు రూపాయలను తక్షణమే తిరిగి మా గ్రామపంచాయతీలకు జమ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేసినారు.
అలాగే 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా “ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైయస్సార్సీపి పార్టీని ఓడించడానికి తీవ్రంగా కృషి చేయాలని – రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వైయస్సార్సీపి, బిజెపి, టిడిపి, జనసేన,సిపిఎం, సిపిఐ లకు చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు, కౌన్సిలర్ కు, కార్పొరేటర్స్ కు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చినారు”.
అలాగే “ఇది చాలా తీవ్రమైన నిర్ణయం అని మాకు తెలుసు కానీ మాకు మరో దారి లేక ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మా నిధులు, అధికారాలను, విధులను దొంగిలించి వేసినారు. అవి తిరిగి ఇవ్వమని రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీల వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం చివరకు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి తో సహా మొదలగు పార్టీలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు” అని రాజేంద్రప్రసాద్ విమర్శించినారు.
12,918 గ్రామాలలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని. మేము స్థానిక ప్రజాప్రతినిధులం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి, అసమర్థులుగా, చేతకాన్ని వాళ్ళలా మా గ్రామాల ప్రజల చేత తీవ్ర నిందలు పడ్డాము. కానీ తప్పు మాది కాదు – జగన్ ది” అని రాజేంద్రప్రసాద్ అన్నారు
” అందుకే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిధిలమైపోయి, గ్రామీణ ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని, అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పడానికి, గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేయడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయం ఈరోజున తీసుకోవడం జరిగిందని” రాజేంద్రప్రసాద్ చెప్పారు.
వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ…
” రెండు నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, అధికార వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని ఓడించడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ముఖ్యంగా అధికార పార్టీ అయిన వైయస్సార్సీపి పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు,జడ్పీటీసీలు,కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ తీవ్రంగా కృషి చేయాలని, మన గ్రామాల, పట్టణ ప్రజలకు జగన్ గారు చేస్తున్న అన్యాయాన్ని సాక్షాదారాలతో సహా వివరించి చెప్పి జగన్ గారికి వ్యతిరేకంగా మన ప్రజలతో ఓటు వేయించి ఓడించాలని “జగన్ ఓడితేనే – మన మనుగడ” అనే నినాదంతో అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఈ రెండు నెలలు చిత్తశుద్ధితో పట్టుదలగా తమ తమ గ్రామాలలో, పట్టణాలలో పనిచేయాలని” లక్ష్మీ ముత్యాలరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్క ధనుంజయ్ యాదవ్, పంచాయితీ రాజ్ ఛాంబర్ సీనియర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వై. వినోద్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతకాయల ముత్యాలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వానపల్లి ముత్యాలరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు బొర్రా నాగరాజు, అనకాపల్లి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల సుజాత ముత్యాలు,సర్పంచుల సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ దాడి ఎరుక నాయుడు, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గొర్రెపాటి వెంకటలక్ష్మి, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post