‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. ‘‘నాన్న తర్వాత అంతటివారైన చిన్నాన్న వివేకానందరెడ్డి అయిదేళ్ల తరువాత ఎన్నికలప్పుడే గుర్తుకొచ్చారా? వివేకం చిన్నాన్న అంటున్నావు.. బంధుత్వానికి అర్థం తెలుసా నీకు? మీ మామను ముద్దుగా మామ అని పిలుస్తావుగా.. నాన్న తర్వాత నాన్న లాంటి చిన్నాన్న చనిపోతే కుట్రను తేల్చాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టించడం ఎంతవరకు న్యాయం?’’ అని నిలదీశారు. అవినాష్రెడ్డి బెయిల్ రద్దు, వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి, సునీల్యాదవ్ల బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా గురువారం హైకోర్టుకు వచ్చిన సునీతారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘చెల్లెలు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అమ్మా.. నేనున్నానని అండగా నిలవాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టిస్తున్నావా? చిన్నాన్న చనిపోయి అయిదేళ్లయింది.. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నావు. అంతఃకరణ శుద్ధిగా నేను అంతా నిజమే చెబుతున్నా.. ఇదే మాట జగన్ ఎందుకు చెప్పడం లేదు? చిన్నాన్నను ఎవరు చంపారన్నది దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసన్నావు… అందుకే వాళ్లను రక్షిస్తున్నావా?’’ అని నిలదీశారు.
చంపించినవారికే టికెట్ ఇస్తారా?
చంపినోడు జైలుకెళ్లకుండా బయట తిరుగుతున్నాడని అంటున్నారని.. చంపినట్లు నమ్ముతున్నప్పుడు ఎవరు చంపించారో దస్తగిరి చెబుతుంటే ఎందుకు నమ్మరని జగన్ను సునీత సూటిగా ప్రశ్నించారు. వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు కుట్ర పన్నారని చెప్పినా ఎందుకు వెనకేసుకు వస్తున్నారని అడిగారు. పోలీసులు నిందితులను ఎలా రక్షిస్తున్నారో చెప్పడానికి కర్నూలు సంఘటనే ఉదాహరణ అన్నారు. వైఎస్ అవినాష్రెడ్డిని సీబీఐ విచారించి నిందితుడిగా తేల్చిందని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెటిచ్చి ఓట్లు వేయాలని అడగటం సిగ్గుచేటన్నారు. ‘‘న్యాయం కోసం పోరాడుతున్నా. దీనివల్ల నేను అందరినీ కోల్పోవడం తప్ప ఏమీ లేదు. నువ్వు మాత్రం నీ పదవుల కోసం వాడుకుంటున్నావు’’ అని జగన్ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.
వైకాపాకు ఓటేయొద్దు
వివేకా రక్తంతో వైకాపా పునాదులు వేసుకుందని, అందులో నిందితులకు, వారిని వెనకేసుకొస్తున్న ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని సునీతారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాన్నను ఓడించిన వారితో తిరుగుతున్నామని జగన్ అంటున్నారని.. ఆయన ఏకంగా నిందితులనే వెనకేసుకుని, వారికే టికెట్లిచ్చారని నిలదీశారు. వివేకాను ఎంత దారుణంగా హత్య చేశారో తెలిసీ దాన్ని మరిచిపోయి ఓటు అడగడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించారు.
source : eenadu.net
Discussion about this post