తెదేపా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లోపు కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పొత్తులో భాగంగా తెదేపాకు 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 లోక్సభ సీట్లు కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 16 మంది పేర్లను వెల్లడించాల్సి ఉంది. లోక్సభ అభ్యర్థుల్లో ఒక్కరినీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రమే వారి పేర్లు వెల్లడించే అవకాశమున్నట్లు తెదేపా వర్గాల ద్వారా తెలిసింది.
ఎన్డీఏ కూటమికి లోక్సభలో 400+ స్థానాలు, ఏపీలో 160కి పైగా ఎమ్మెల్యే సీట్లు అనే నినాదం రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారని చెప్పారు. ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
source : eenadu.net
Discussion about this post