సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించగా.. ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామాలపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని, సందేశాలు పంపారని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంగా ఉన్నాననీ చెప్పడం లేదని వెల్లడించారు. ‘‘జగన్మోహన్రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, రఘురామకృష్ణరాజుకు భాజపా నుంచి టికెట్ రానివ్వరని ముందే పిల్ల సజ్జల వెబ్సైట్లు, మీడియా ఛానల్స్లో చెప్పారు. జగన్ నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశారు. జైల్లో చంపే ప్రయత్నం చేశారు. తన మతానికి చెందిన అధికారిని అడ్డం పెట్టుకొని, ఇక్కడి ప్రభుత్వ అధినేతలతో కుమ్మక్కై నన్ను అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో చంపేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిలో విఫలమయ్యారు. పోలీసులను అడ్డం పెట్టుకుని లేపేయాలని చూశారు. ప్రతి ఒక్కరికీ ప్రతిసారీ విజయం దక్కదు. నాకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారు. అపజయాన్ని అంగీకరిస్తున్నా. జగన్ ఇంత పని చేస్తారని తెలిసినా, ఏ మూలనో ఒక నమ్మకం ఉండడంతో తేలికగా తీసుకున్నా’’ అని తెలిపారు.
నాలుగేళ్లుగా పోరాడి..
‘‘గత నాలుగేళ్లుగా జగన్ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేశాను. ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేస్తున్నాను. రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయించి, జగన్ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు రఘురామ కాదు. జగన్ ప్రభావం వల్ల నరసాపురం స్థానాన్ని నాకు కేటాయించలేదు. భాజపా నేత సోము వీర్రాజుకు, జగన్కు ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. సోము వీర్రాజు ద్వారా టికెట్ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసింది. నరసాపురం నుంచి పోటీచేస్తానా? మరో స్థానం నుంచా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది. జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వను’’ అని హెచ్చరించారు.
‘‘రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది. జగన్ చీప్ ట్రిక్స్ పనిచేయవు. పదవే అనుభవించాలని కోరిక ఉంటే, జగన్కు తలొగ్గితే… నాలుగేళ్లపాటు దిల్లీలో ఉంటూ అజ్ఞాతవాసం గడపాల్సిన అవసరం ఉండేది కాదు. పనికిమాలిన వైకాపాలో చేరి ప్రజలకు అన్యాయం చేశానని భావించడం వల్లే ప్రాణాలకు తెగించి పోరాటం చేశాను. అమరావతి రైతులకు చేసిన అన్యాయం, సొంత బాబాయిని హత్య చేయించిన వైనం, కోడికత్తి దాడి లాంటి ఆగడాలు చూసిన తర్వాత అంతరాత్మ అంగీకరించక జగన్పై తిరుగుబాటు చేశాను. మంచి ఆశయాలు ఉన్న తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశంతో, ఎంతోమంది ఆదరాభిమానాలను కురిపిస్తున్నా.. తెదేపా ఉండగా మరో పార్టీ ఎందుకని ఆలోచించాను. అదే దృక్పథంతో కొనసాగుతున్నాను. గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. దీన్ని మోసం, అన్యాయం అని నేను అనడం లేదు. ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నించే గొంతు వినిపించే ప్రయత్నంలో ఉంటాను. పార్టీలు అన్యాయం చేసినా ప్రజలు అన్యాయం చేయరనే నమ్మకంతో ఉన్నాను. కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక సమస్యలు ఉండవు. పక్క పార్టీలోనూ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పాలకపక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రజలతో కలిసి పోరాటం చేస్తాను’’ అని వెల్లడించారు.
source : eenadu.net
Discussion about this post